India: భారత్ లో మతస్వేచ్ఛ లేదు... క్రైస్తవులు, ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయి!: అమెరికా

  • భారత్ లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయన్న అమెరికా
  • ఇంటర్నేషనల్ రెలిజయస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ప్రకారం హిందువులు దాడులు చేస్తున్నారని ఆరోపణ
  • భారత్ లో మతస్వేచ్ఛ కోసం 5 లక్షల డాలర్లు విడుదల చేస్తామని ప్రకటన

భారత్ లో మతస్వేచ్ఛ లేదని అమెరికా సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయని ఈ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా, భారత్ లో మతస్వేచ్ఛ కోసం 5 లక్షల డాలర్ల నిధులు అందజేయనున్నట్టు పేర్కొంది. ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ రిపోర్టు ప్రకారం శ్రీలంక, భారత దేశాల్లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అమెరికా ఆరోపించింది. దీంతో భారత్ లో రెలిజియస్ ఫ్రీడమ్ కోసం ప్రభుత్వేతర సంస్థలకు అంటే ఎన్జీవోలకు ఈ నిధులు అందజేయనున్నట్టు అమెరికా తెలిపింది.

ఈ నిధులను సమాజాన్ని, జర్నలిస్ట్‌ లను చైతన్య పర్చడం, మత స్వేచ్ఛను కాపాడటం, మత సంబంధ దాడులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టం ఏం చెబుతుంది, మానవహక్కులు ఏమిటో చెప్పడం వంటి పనులను ఈ ఎన్జీవోలు నిర్వర్తించాల్సి ఉంటుందని అమెరికా పేర్కొంది. దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన, కార్మికుల రక్షణ తదితర 28 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది.

 ఇందుకోసం 17 మిలియన్‌ డాలర్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ జాబితాలో భారత్ కు స్థానం లేకున్నా భారత్ కు నిధులు అందజేయాలని అమెరికా నిర్ణయించడం ఆశ్చర్యకరమైన అంశమని విమర్శకులు పేర్కొంటున్నారు. ఆఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, తజకిస్థాన్‌, తుర్కుమెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాలు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. 

More Telugu News