Airtel: ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బ్రహ్మాండమైన ఆఫర్!

  • మిగిలిపోయిన డేటాను వచ్చే నెలలో వాడుకునే అవకాశం
  • 1000 జీబీల వరకు క్యారీ చేసుకోవచ్చు
  • పోస్టుపెయిడ్ మొబైల్ యూజర్లకు మాత్రం 200 జీబీకే పరిమితం

దేశంలోని అతిపెద్ద టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. నెలనెలా వాడగా మిగిలిపోయిన డేటాను ఇకపై తర్వాతి నెలలోనూ వాడుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ ఏడాది జూలైలో మొబైల్ యూజర్లకు ఇటువంటి ఆఫర్‌నే ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఆగస్టు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్‌ దేశంలోని తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులందరూ ఉపయోగించుకోవచ్చని వివరించింది.

తాజా ఆఫర్‌తో వినియోగదారులు ప్రతీనెలా మిగిలిపోయే డేటాను మొత్తంగా 1000 జీబీల వరకు పోగుచేసుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ మొబైల్ వినియోగదారులకైతే ఇది 200 జీబీకే పరిమితం. అయితే ఈ అవకాశం అన్ని ప్లాన్లకు అందుబాటులో లేదు. ఎంపిక చేసిన కొన్ని ప్లాన్లకే ఈ రోల్ఓవర్ అవకాశం ఉంది. ఈ విషయంలో సర్కిల్‌కు, సర్కిల్ కు మధ్య కొంత తేడా కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

తాజా ఆఫర్‌లో భాగంగా వినియోగదారుడు ఒకవేళ నెలవారీ 200 జీబీ ప్లాన్‌ను ఉపయోగిస్తూ ఆ నెలలో 150 జీబీ మాత్రమే ఉపయోగించుకుంటే మిగిలిపోయిన 50 జీబీ వచ్చే నెలకు క్యారీ అవుతుంది. అప్పుడా నెలలో అతడికి 250 జీబీ లభిస్తుంది. అయితే యూజర్ సేమ్ ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

More Telugu News