PV Sindhu: సింధూ... దయచేసి ఇంకొక్క మాట చెప్పకు... ఓ కుటుంబం రోడ్డున పడుతుంది: ట్విట్టర్లో వెల్లువెత్తుతున్న సలహాలు

  • అసలేం జరిగిందో చెప్పవద్దని నెటిజన్ల సలహాలు
  • ఓ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దని సూచన
  • క్షమించి వదిలేయాలని చెబుతున్న అభిమానులు
  • ఏం జరిగిందన్న విషయాన్ని ఇంకా చెప్పని సింధూ

తాను ముంబైకి బయలుదేరిన వేళ, విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ లోని అజితేష్ అనే వ్యక్తి నుంచి అవమానింపబడ్డానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వెల్లడించి, అసలేం జరిగిందో చెప్పకుండా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు ట్వీట్లు ఉంటాయని పీవీ సింధూ ట్విట్టర్ పేజీ చూపుతుండగా, ఒక్కటి మాత్రమే కనిపిస్తోంది.

 ఇక ఈ ట్వీట్ ను చూసిన ఆమె అభిమానులు, అజితేష్ ను క్షమించాలని సలహా ఇస్తున్నారు. మరొక్క ట్వీట్ పెడితే, అతని ఉద్యోగం పోతుందని, నీ అంతటి స్టార్ కు చేదు అనుభవాన్ని చూపినందుకు మరెక్కడా ఉద్యోగం లభించకుండా, అతని కుటుంబం రోడ్డున పడుతుందని అంటున్నారు. క్షమించి వదిలేస్తే సింధూ గొప్పతనం మరింతగా పెరుగుతుందని అంటున్నారు.

 ఇప్పుడున్న ట్వీట్ ను డిలీట్ చేయాలని, అతనిపై కంపెనీకి డైరెక్టుగా ఫిర్యాదు చేస్తే సరిపోతుందని మరికొందరు అంటున్నారు. అతను ఓ చిన్న ఉద్యోగి కావచ్చని, సింధును ఏమైనా అంటే ఎంత దూరం పోతుందన్న విషయం తెలిసి వుండకపోవచ్చని, క్షమించి వదిలేయమని మరికొందరు చెబుతున్నారు. ఇక ఈ స్పందనలను చూసిన సింధూ అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడిస్తుందో? లేదో?!

More Telugu News