healthy food: ఆరోగ్యం కావాలా?... పాత తరం తిండే మేలు!: వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి

  • పౌష్టికాహార లోపంపై పరిశోధనలు చేసిన వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 
  • అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలకు ప్రస్తుతం డిమాండ్
  • పాత తరంలో ఆహారంతోనే పిండిపదార్థాలు, చక్కెర, నూనెలు అందేవి...మరిప్పుడో?

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అయినా మన తాతలు, బామ్మలంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని ప్రతి ఇంట్లో ఆందోళన చెందే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోషకాహార లోపం ఎందుకు వస్తోందంటూ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దీంతో ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యం చాలా తక్కువని, ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని శాస్త్రవేత్త లారా ఇయనోట్టి తెలిపారు. పాతతరం ఆహారం ఇప్పుడు తీసుకుంటున్న ఆహారానికి పూర్తి భిన్నంగా ఉండేదని తెలిపారు.

ఇలా తీసుకుంటున్న ఆహారం కారణంగా కాలక్రమంలో మానవ జన్యువులో వైవిధ్యం వచ్చి చేరిందని, తద్వారా పౌష్టికాహారలోపం వేధించడం ఆరంభించిందని స్పష్టం చేశారు. అతిగా శుద్ధి చేసిన ఆహారపదార్థాలకు ప్రస్తుతం డిమాండ్ ఉందని లారా గుర్తు చేశారు. తిండిగింజల నుంచి తయారు చేసే నూనెలు, పిండిపదార్థాలు, చక్కెరలు పాతకాలపు ఆహారంలో లేవని గుర్తు చేశారు. అవన్నీ వారు ఆహారంలో భాగంగానే తీసుకునేవారని ఆమె తెలిపారు. అలా జరగకపోవడం వల్లే ప్రస్తుతం పౌష్టికాహార సమస్య వచ్చి చేరిందని ఆమె స్పష్టం చేశారు. పదికాలాలపాటు ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాలంటే పాత తరం తిండే మేలని ఆమె తేల్చి చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు న్యూట్రీషన్‌ రివ్యూస్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

More Telugu News