priyanka chopra: ఓ మై గాడ్... నా ఇంటి దగ్గరే ఉగ్రదాడి, హడలిపోయాను: ప్రియాంక చోప్రా

  • దాడి జరిగిన ప్రదేశానికి ఐదు ఇళ్ల అవతల ప్రియాంక నివాసం
  • ఇంటికి వచ్చే ముందు ఘటన
  • ప్రస్తుతం ప్రపంచమున్న పరిస్థితి ఇదా?
  • ట్విట్టర్ లో ప్రియాంకా చోప్రా

అమెరికాలోని న్యూయార్క్‌ లో నిన్న జరిగిన ఉగ్రదాడిపై బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్పందించింది. ప్రస్తుతం న్యూయార్క్ లో ప్రియాంక నివసిస్తున్న ఇంటికి ఐదు ఇళ్ల అవతలే ఈ ఘటన జరిగిందట. దుండగుడు ట్రక్కుతో దాడికి పాల్పడగా, ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ భయానక ఘటనపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన ప్రియాంక, తన పని పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న వేళ, ఆ ప్రాంతమంతా సైరన్ల మోతతో హోరెత్తుతుంటే హడలిపోయానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రపంచమున్న పరిస్థితిని ఈ ఘటన తెలియజేస్తోందని పేర్కొంది.

కాగా, సైఫుల్లా సైపోవ్‌ అనే యువకుడు ట్రక్కుతో సైకిల్‌ పై వెళ్తున్న వారిని ఢీకొంటూ దూసుకెళ్లి, ఆపై పాఠశాల చిన్నారులపైకి కూడా దూసుకెళ్లినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇతను ఉజ్బెకిస్థాన్‌ నుంచి వచ్చిన వ్యక్తని న్యూయార్క్‌ పోలీసులు ప్రకటించారు. 'అల్లాహు అక్బర్‌' అని కేకలు వేస్తూ దాడి చేశాడని, దాడిలో గాయపడిన 11 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని న్యూయార్క్ పోలీసు విభాగం అధికారులు తెలిపారు.




More Telugu News