ntr: చనిపోయే ముందు రోజు అక్కినేనికి ఫోన్ చేసి, మనసులో మాట చెప్పాలని ఉందన్న ఎన్టీఆర్.. కృష్ణక్క చెప్పిన నాటి సంగతులు!

  • మధ్యవర్తుల కారణంగా విభేదాలు వచ్చినా ఇద్దరూ ఒకటే
  • చనిపోయే ముందు రోజు ఏఎన్ఆర్ కు ఫోన్ చేసిన ఎన్టీఆర్
  • కలవాలని ఉందని, ఇంటికి రమ్మని చెప్పిన మహానేత
  • మనసులో బాధ ఉందని చెప్పుకున్న ఎన్టీఆర్

తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లవంటివారైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల మధ్య జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి రచయిత కృష్ణక్క, వారి అభిమానులు, తెలుగు ప్రజలతో పంచుకున్నారు. వారిద్దరి మధ్యా ఎంతో ప్రేమ ఉండేదని, మధ్యవర్తుల కారణంగా కొన్ని క్లాషెస్ వచ్చినా, అవి తాత్కాలికమేనని అన్నారు. ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారన్న విషయాలు తెలుసుకోవడానికి ఏఎన్ఆర్ ఆసక్తిని చూపేవారని చెప్పుకొచ్చారు.

తాను ఏఎన్ఆర్ గారింట్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో ఆయన గొంతు ఓ రకంగా ఉందని గుర్తు చేసుకున్నారు. ఏంటి బ్రదర్? అని నాగేశ్వరరావు అడిగితే, "ఏం లేదు బ్రదర్ మిమ్మల్ని చూడాలని ఉంది. ఒకసారి మనసు విప్పి చాలా చెప్పుకోవాలని ఉంది. ఒకసారి వస్తారా ఇంటికి?" అని ఎన్టీఆర్ అడిగారు. ఏఎన్ఆర్ ఎందుకో ఆ గొంతు విని చాలా చలించిపోయారు.

"ఎందుకు బ్రదర్, అలా అంటున్నారు. ఈ మధ్యనే ఇంటికి భోజనానికి వచ్చారు కదా" అని గుర్తుచేస్తే, "కాదు బ్రదర్... మీతో చాలా చెప్పుకోవాలని ఉంది. మనసులో మాట చెప్పాలి" అని ఎన్టీఆర్ అన్నారట. తప్పకుండా వస్తానని చెప్పిన ఏఎన్ఆర్, ఆ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పారని, ఆ మరునాడే ఆయన వెళ్లిపోయారని తెలిసి, తట్టుకోలేక చాలాసేపు అలాగే ఉండిపోయారని కృష్ణక్క అన్నారు.

More Telugu News