sri sri ravishankar: అయోధ్య మందిరం వివాదానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న శ్రీశ్రీ రవిశంకర్ కు.. ఆదిలోనే చుక్కెదురు!

  • రామ మందిర ప్రాంతాన్ని ఇంత వరకు రవిశంకర్ దర్శించలేదు
  • మధ్యవర్తిత్వం వహించే అర్హత ఆయనకు లేదు
  • హిందూ, ముస్లింల ఆమోదంతోనే ఆలయ నిర్మాణం

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించిన వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కు ఆదిలోనే చుక్కెదురైంది. రవిశంకర్ నిర్ణయాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, బాబ్రీ యాక్షన్ కమిటీలతో పాటు మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి తిరస్కరించారు.

ఈ సందర్భంగా వేదాంతి మాట్లాడుతూ, అయోధ్య మందిర నిర్మాణం ఉద్యమంలో రవిశంకర్ ఏనాడూ పాల్గొనలేదని... ఈ నేపథ్యంలో, ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించే అర్హత ఆయనకు లేదని స్పష్టం చేశారు. మందిర నిర్మాణం కోసం తాము జైలుకు కూడా వెళ్లామని, కేసులకు భయపడకుండా పోరాటం చేస్తున్నామని చెప్పారు. రవిశంకర్ కనీసం రామ మందిర ప్రాంతాన్ని కూడా దర్శించలేదని తెలిపారు. ఇలాంటి వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించబోమని అన్నారు. ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి, చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతోనే ఆలయ నిర్మాణం జరగాలని తాము భావిస్తున్నట్టు తెలిపారు. 

More Telugu News