Rashi khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రాశిఖన్నాకు మలయాళం ఆఫర్లు
  • అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ ప్రాజక్ట్ 
  • 'అజ్ఞాతవాసి' కోసం వెళ్లిన అనూ ఇమ్మానుయేల్
  • అమెరికా వెళుతున్న మహేశ్ బాబు

*  అందాలబొమ్మ రాశిఖన్నా ఇటీవల మలయాళంలో మోహన్ లాల్ తో కలసి నటించిన 'విలన్' చిత్రం మంచి హిట్టయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అక్కడి నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. అయితే, మలయాళంలో కొత్త చిత్రాలను ఒప్పుకునే విషయంలో రాశి ఆచితూచి అడుగేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో చేస్తూనే, అక్కడ కూడా మంచి ప్రాజక్టులనే చేయాలని ఈ చిన్నది ఆలోచిస్తోందట.  
*  తాజాగా రవితేజతో 'రాజా ది గ్రేట్' చిత్రాన్ని చేసి హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మల్టీ స్టారర్ గా చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోందని, దిల్ రాజు బ్యానర్లోనే ఇది ఉంటుందని అనిల్ చెప్పాడు.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా యూరప్ లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. ఇప్పటివరకు కొన్ని సన్నివేశాలని అక్కడ చిత్రీకరించారు. ఇప్పుడు పాటల చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు. ఈ షూటింగులో జాయిన్ కావడానికి కథానాయిక అనూ ఇమ్మానుయేల్ బల్గేరియాకు బయలుదేరి వెళ్లింది.
*  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అను నేను' చిత్రం షూటింగులో వున్న మహేశ్ బాబు త్వరలో అమెరికాలోని లాస్ వెగాస్ కు  వెళుతున్నాడు. థమ్సప్ శీతల పానీయం వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగులో మహేశ్ పాల్గొంటాడు. నవంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు అక్కడ ఈ చిత్రీకరణ జరుగుతుంది.   

More Telugu News