BSE: తడబడ్డా లాభాలతో... సరి కొత్త రికార్డులకు భారత స్టాక్ మార్కెట్!

  • సెషన్ ఆరంభంలోనే లాభాలు
  • మధ్యలో తడబడ్డా నిలిచిన లాభం
  • 0.33 శాతం పెరిగిన సెన్సెక్స్

ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకు తోడు, మారిన ఇన్వెస్టర్ల వైఖరితో సెషన్ ఆరంభం నుంచే లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు, ఓ దశలో లాభాల స్వీకరణతో కాస్త తడబడినా, చివరికి ఆల్ టైం రికార్డు ముగింపును నమోదు చేసి సరికొత్త రికార్డులు లిఖించాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 108.94 పాయింట్లు పెరిగి 0.33 శాతం లాభంతో 33,266.16 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 40.60 పాయింట్లు పడిపోయి 0.39 శాతం నష్టంతో 10,363.65 పాయింట్ల వద్దకు చేరాయి.

బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.13 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 30 కంపెనీలు లాభాల్లో నడిచాయి. యస్ బ్యాంక్, లుపిన్, ఇన్ ఫ్రాటెల్, ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, విప్రో, ఎంఅండ్ఎం తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,43,93,153 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,825 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1703 కంపెనీలు లాభాలను, 977 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.83 వద్ద కొనసాగుతోంది.

More Telugu News