revant reddy: ఎవరెవరు వస్తున్నారు?... రేవంత్ ఇంటి చుట్టూ అడుగడుగునా ఇంటెలిజన్స్ అధికారుల ఆరా!

  • 119 అసెంబ్లీల నుంచి టీడీపీ కార్యకర్తలు
  • ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్
  • రేవంత్ ఇంటి వద్ద భారీగా మఫ్టీలో ఐబీ అధికారులు

ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి, ఆపై తన నివాసంలో కార్యకర్తలు, ముఖ్య నేతలతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ సమావేశానికి రేవంత్ అభిమానులు వచ్చినట్టు తెలుస్తుండగా, వారిలో అత్యధికులు టీడీపీ కార్యకర్తలని సమాచారం.

ఇక రేవంత్ తో పాటు మరింతమంది కాంగ్రెస్ లోకి వెళ్లవచ్చని భావిస్తున్న నేపథ్యంలో, వారు ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రేవంత్ ఇంటి సమీపంలో మఫ్టీలో ఉన్న పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు? ఈ ఆత్మీయ సమావేశానికి ఎవరు వచ్చారు? వారి వ్యూహాలు ఏంటి? ఏ పార్టీకి చెందిన వారు ఎంతమంది వచ్చారు? ఏ ప్రాంతం నుంచి అధికంగా వచ్చారు? అన్న అంశాలపై సమాచారాన్ని వీరు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News