Revanth Reddy: కొడంగల్‌కు ఉప ఎన్నిక.. రేవంత్‌కు పోటీగా మంత్రి సోదరుడు!

  • కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికకు వెళ్లనున్న రేవంత్?
  • టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి
  • ఆయన కాకుంటే మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఉప ఎన్నికలో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఆయనను ఎదుర్కొనేందుకు రాష్ట్ర రోడ్డు రవాణామంత్రి పి.మహేందర్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు సమాచారం.

రేవంత్ రాజీనామాను ముందే ఊహించిన టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ అనుచరులను ముందు తనవైపు తిప్పుకుని నియోజకవర్గంపై  పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేసింది. రేవంత్‌రెడ్డి పార్టీని వీడనున్నారన్న ప్రచారంతో పలువురు స్థానిక టీడీపీ నేతలు పలు దఫాలుగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా, రేవంత్‌రెడ్డిపై పోటీకి నిలబెట్టాలనుకుంటున్న నరేందర్‌రెడ్డి కొడంగల్, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌పై నరేందర్‌రెడ్డిని నిలపాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయన కాని పక్షంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని నిలబెట్టాలని యోచిస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథరెడ్డి గత ఎన్నికల్లో రేవంత్ చేతిలో పరాజయం పాలయ్యారు.

More Telugu News