revant reddy: రేవంత్ సంగతి అటో ఇటో ఇవాళే తేల్చేస్తానన్న చంద్రబాబు!

  • చంద్రబాబు రాగానే వెళ్లి కలిసిన ఎల్ రమణ
  • విషయమంతా విని మరోసారి మాట్లాడి చూద్దామన్న చంద్రబాబు
  • ఏది ఏమైనా ఇవాళే ఓ నిర్ణయం తీసుకుందామని వెల్లడి!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారిన పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయాన్ని అటో ఇటో ఇవాళే తేల్చేస్తానని, పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం చంద్రబాబు లండన్ నుంచి రాగానే, ఆయన దగ్గరికి వెళ్లిన ఎల్ రమణ, దాదాపు అర గంటకు పైగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రేవంత్ వైఖరి, ఆయన ఢిల్లీలో ఎవరిని కలిసింది... ఆపై ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ నేతలతో జరిపిన మంతనాలు, ముఖ్యంగా తనను వ్యతిరేకించే డీకే అరుణ, కోమటిరెడ్డి బ్రదర్స్ తో జరిపిన చర్చల సారాంశంపై మీడియాలో వచ్చిన కథనాలను చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.

ఆయన పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారని రమణ వ్యాఖ్యానించడంతో, ఓ సారి చెప్పి చూద్దామని అన్న చంద్రబాబు, ఇవాళ సాయంత్రంలోగా ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరువాతనే నేతలందరితో కలసి లేక్ వ్యూ గెస్టు హౌస్ లో చంద్రబాబు సమావేశమై తాజా పరిస్థితులను చర్చించారు. ఇక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయంపైనే చర్చ సాగుతోంది.

More Telugu News