kancha ilaiah: అది తప్పని నిరూపించండి.. ఆత్మహత్య చేసుకుంటా: టీజీ వెంకటేష్

  • ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపించండి
  • ఐలయ్య పుస్తకంపై పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదు
  • అమెరికాకు ఐలయ్య వత్తాసు పలుకుతున్నారు

'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం రాసిన కంచ ఐలయ్యకు, ఆర్యవైశ్యులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా ఐలయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, టీజీ వెంకటేష్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే, తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఉత్తర భారతదేశంలోని బనియా సంపన్నులతో ఆర్యవైశ్యులను పోల్చడం సరికాదని అన్నారు. ఐలయ్య రాసిన పుస్తకంపై పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదని, కేవలం డిస్పోజ్ మాత్రమే చేసిందనే విషయాన్ని అందరూ గమనించాలని కోరారు.

త్వరలోనే ఈ కేసు మళ్లీ విచారణకు రానుందని టీజీ వెంకటేష్ తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ కాలం గడుపుతున్న ఐలయ్య... వెనకబడిన కులాలకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశాలకు ఐలయ్య వత్తాసు పలుకుతున్నారని... అలాంటి వ్యక్తికి కమ్యూనిస్టులు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

More Telugu News