threat: క్రికెట్ ఆడితే కాల్చి పారేస్తానని బెదిరించారు.. సోదరులపై కేసు పెట్టిన బాలిక!

  • బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా కాలేజీ మాన్పించిన సోదరులు
  • క్రికెట్ ఆడతానని చెబితే చేయిచేసుకున్నారన్న బాలిక
  • వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన

క్రికెట్ ఆడినా, కాలేజీకి వెళ్లి చదువుకున్నా తనను కాల్చి చంపుతామని సోదరులు బెదిరించారంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. హరియాణాలోని సోనెపట్ జిల్లా దేవ్రు గ్రామానికి చెందిన బాలిక బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్రికెట్‌ను ప్రాణంగా భావించే బాలిక కళాశాలలో క్రికెట్ ఆడేది. విషయం తెలిసిన ఆమె ఇద్దరు సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను కాలేజీ మాన్పించారు.

‘‘చదువుకుంటానని, క్రికెట్ ఆడతానని చెప్పినప్పుడు నాపై చేయిచేసుకున్నారు. మా చిన్నన్నయ్య కాల్చి చంపుతానని బెదిరించాడు’’ అని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. క్రికెట్‌ ఆడాలన్నది తన సొంత నిర్ణయమేనని, ఈ విషయంలో టీచర్లు, కాలేజ్ మెంటార్ల ఒత్తిడి లేదని బాలిక తెలిపింది. తన సోదరులకు దూరంగా బతకాలనుకుంటున్నానని, తన ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోవాలనుకుంటున్నానని పేర్కొంది. సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని భయాన్ని వ్యక్తం చేసింది.

బాలిక ఫిర్యాదుతో పోలీసులు ఆమె సోదరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమె పెద్ద సోదరుడు రాష్ట్ర హోం గార్డ్స్‌లో పనిచేస్తుండగా, చిన్న సోదరుడు బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News