Delhi: ఢిల్లీ వాసులను భయపెట్టిన కాల్పుల ఘటనలో నిందితుడు హతురాలి భర్తే!

  • గురుద్వారాకు వెళ్లి వస్తున్న దంపతులు, కుమారుడిపై కాల్పులు
  • భార్య మృతి.. భర్తకు స్వల్ప గాయాలు  
  • హత్యకు ప్లాన్ చేసి సుపారీ ఇచ్చింది భర్తే కావడం కలకలం రేపుతోంది

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదు హత్యలు జరగడం పట్ల ఢిల్లీలో భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిర్భయ ఘటన అనంతరం చోటుచేసుకున్న అత్యాచారాలతో...రేప్ ల రాజధానిగా పేరొందిన ఢిల్లీ ఇప్పుడు హత్యల రాజధానిగా మారుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి రోహిణి ప్రాంతంలోని షాలిమర్‌ బాగ్‌ లో ప్రియా మెహ్రా, ఆమె భర్త పంకజ్‌ మెహ్రా, రెండేళ్ల కుమారుడి కారుపై జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి.

 దాని వివరాల్లోకి వెళ్తే కుటుంబంతో కలిసి పంకజ్ మెహ్రా గురుద్వారాకు వెళ్లారు. గురుద్వారాలో పూజలు ముగించి ముగ్గురూ ఇంటికి చేరుకుంటున్న క్రమంలో వారిపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కుమారుడ్ని సీటు వెనుక దాచి కాపాడుకున్న ప్రియా మెహ్రా మృతిచెందగా, భర్త పంకజ్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాల్పుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు హతురాలి భర్తపైనే అనుమానం కలిగింది. ఒకే కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తల్లో భార్య ప్రియా మెహ్రాకు ఎక్కువ బుల్లెట్లు తగలడం, భర్త స్వల్పగాయాలతో బతికి బట్టకట్టడం అనుమానాలు రేకెత్తించింది.

 దీంతో ఈ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. దీంతో హత్య పథకం బయటపడింది. వ్యాపారి అయిన పంకజ్‌ మరో వ్యాపారి దగ్గర 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అతనిని తప్పించుకుని తిరుగుతుండడంతో ఆయన గత కొంత కాలంగా పంకజ్ ను బెదిరిస్తున్నాడు. దీంతో పథకం రచించిన పంకజ్‌ తన భార్య ప్రాణాలు పణంగా పెట్టాడు. కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భార్యను చంపించేసి, ఆ హత్యను అతనిపై తోసేయాలని భావించాడు. అయితే పోలీసు విచారణతో అతని ప్లాన్ బట్టబయలైంది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 

More Telugu News