Hyderabad: కామాంధుల చేతుల్లో చిక్కుకున్న మహిళలు.. ఒకరిపై సామూహిక అత్యాచారం!

  • స్నేహితురాలితో కలిసి దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడి వద్ద బస్సుకోసం ఎదురు చూసిన మహిళ
  • హయత్ నగర్ వెళ్తున్నాము, దించేస్తామని చెప్పడంతో కారెక్కిన మహిళలు
  • అసభ్యంగా ప్రవర్తిస్తూ, హయత్ నగర్ లో కారు ఆపకుండా దూసుకెళ్లిన దుండగులు 
  • పెద్ద అంబర్ పేటలో కారులోంచి దూకేసిన ఒక మహిళ

ప్రమాదాన్ని పసిగట్టిన మహిళ కారులోంచి దూకేసి మానప్రాణాలు కాపాడుకోగా, ఆమె స్నేహితురాలు మాత్రం సామూహిక అత్యాచారానికి గురైన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. హయత్ నగర్ పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే... చంపాపేట్‌ కు చెందిన మహిళ (33) చీరల వ్యాపారం చేస్తుంది. ఆమెకు ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రి సమీపంలో నివసించే మరో మహిళ (30) తో పరిచయం ఏర్పడింది. గత రాత్రి వీరిద్దరూ హయత్‌ నగర్‌ కు వెళ్లేందుకు దిల్‌ సుఖ్‌ నగర్‌ లోని సాయిబాబా గుడి సమీపంలో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.

అంతలో వారి దగ్గరకు ఒక కారు వచ్చి ఆగింది. తాము హయత్ నగర్ వైపు వెళ్తున్నామని, దించేస్తామని నమ్మబలికారు. దీంతో వారు కారెక్కారు. కారెక్కిన తరువాత మద్యం మత్తులో ఉన్న ముగ్గురు దుండగులు వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. దీంతో వారు ప్రతిఘటించారు. ఈ క్రమంలో హయత్ నగర్ వద్ద కారు ఆపకుండా తీసుకెళ్తుండడంతో డోర్ దగ్గర ఉన్న మహిళ పెద్ద అంబర్ పేట వద్ద కారులోంచి కిందికి దూకేసింది. దీంతో మరో మహిళ దూకలేని పరిస్థితుల్లో కారులో ఉండిపోయింది.

ఆమెను ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డు నుంచి గండిచెర్వు వైపు నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఇంతలో అటుగా పోలీసు వాహనం వస్తూ సైరన్ మోగించడంతో ఆమెను వదిలిన కామాంధులు, ఆమె దగ్గరున్న 2,000 రూపాయలు, ఆమె సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. దీంతో రోడ్డుపైకి చేరిన ఆమె ఒక డీసీఎం వ్యాన్ ఎక్కి ఇంటికి చేరుకుంది. అనంతరం కారులోంచి కిందికి దూకిన మహిళతో కలిసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెను వైద్యపరీక్షలకు ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

More Telugu News