salman khan: స‌ల్మాన్ ఖాన్ త‌దుప‌రి చిత్రం `భర‌త్‌`... 2019 రంజాన్‌కి విడుద‌ల‌

  • ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్‌
  • నిర్మాత అతుల్ అగ్నిహోత్రి
  • 2018 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌దుప‌రి చిత్రం ఖరారైంది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `భర‌త్‌` అనే చిత్రంలో స‌ల్మాన్ న‌టించ‌నున్నాడు. ఈ చిత్రానికి అత‌ని బావ అతుల్ అగ్నిహోత్రి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించనున్నారు. 2018 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించి 2019 రంజాన్‌కి విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. `ఓడే టు మై ఫాద‌ర్‌` అనే కొరియ‌న్ చిత్రం ఆద‌ర్శంగా ఈ సినిమాను తెరకెక్కించ‌నున్నారు. కొరియ‌న్ చిత్రంలో 1950 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కొరియా దేశం ప‌రిస్థితుల‌ను, హీరో జీవితాన్ని పోల్చి చూపిస్తారు. అదేవిధంగా భార‌త దేశ చ‌రిత్ర‌ను స‌ల్మాన్ పోషించ‌నున్న `భర‌త్‌` పాత్ర‌లో స‌మ‌న్వ‌యం చేస్తూ ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ తెలిపారు.

క‌థ పూర్తి భిన్నంగా ఉన్న‌ప్ప‌టికీ అధికారికంగా ఎలాంటి చ‌ట్ట‌ప‌ర‌మైన‌ స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌ని కొరియ‌న్ చిత్రం రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నట్లు నిర్మాత అతుల్ అగ్నిహోత్రి తెలిపారు. గ‌తంలో అలీ అబ్బాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ న‌టించిన `బాడీగార్డ్` చిత్రం పెద్ద హిట్‌. అలాగే అతుల్ నిర్మాణంలో స‌ల్మాన్ న‌టించిన `సుల్తాన్` కూడా పెద్ద హిట్‌. ఒక్క `ట్యూబ్‌లైట్` చిత్రం మిన‌హా రంజాన్ సంద‌ర్భంగా విడుద‌లైన స‌ల్మాన్ చిత్రాల‌న్నీ దాదాపు పెద్ద హిట్లుగానే నిలిచాయి. ఈ సెంటిమెంట్ కార‌ణంగానే `భర‌త్` చిత్రాన్ని కూడా రంజాన్ పండ‌గ‌కు విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ న‌టించిన‌ `టైగ‌ర్ జిందా హై` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

More Telugu News