army men: ఐదో పెళ్లికి సిద్ధమైన జవాను.. అరదండాలు వేసిన పోలీసులు!

  • విడాకుల ఊసెత్తకుండా నాలుగు వివాహాలు చేసుకున్న ఆర్మీ జవాను
  • ఐదో పెళ్లికి సిద్ధమవుతుండగా పెళ్లి మండపంలోకి వచ్చిన పోలీసులు
  • అరెస్టు చేసిన పోలీసులు

వృత్తి దేశరక్షణ... ప్రవృత్తి పెళ్లిగా మారిన జవానును పోలీసులు అరెస్టు చేసిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... మైసూరు జిల్లా కె.ఆర్‌.నగర తాలూకా సాలిగ్రామ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను శివనంజప్ప పంజాబ్‌ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మైసూరులోని యోగా నరసింహస్వామి ఆలయంలో ఓ యువతిని ఇతను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. సోమవారం వేకువ జామున ముహూర్తం. వివాహానికి అంతా సిద్దమైన తరుణంలో పోలీసులు దేవాలయానికి చేరుకున్నారు.

అతని మొదటి భార్య వరలక్ష్మి సాక్ష్యాధారాలతో సహా అతను నాలుగు వివాహాలు చేసుకున్నట్టు ఫిర్యాదు చేసిందని, ఐదో వివాహానికి సిద్ధం కావడంతో అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. దీంతో నిత్యపెళ్లి కొడుకైన శివనంజప్ప పెళ్లి కథ సమాప్తమైంది. కాగా, వరలక్ష్మిని 2007లో శివనంజప్ప వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె గర్భందాల్చడంతో పుట్టింటికి పంపి వేధింపులు ప్రారంభించాడు.

దీంతో 2009లో ఆయనపై గృహహింస కేసు నమోదైంది. ఇంతలోనే అతను శ్వేత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే ఆమె అతడిని వదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆశారాణి అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. వీరెవరికీ శివనంజప్ప విడాకులివ్వకపోవడం విశేషం.

More Telugu News