Mumbai: మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన యువకుడు.. భయంతో కదులుతున్న రైలు నుంచి దూకేసిన బాలిక

  • ముంబై సీఎస్టీలో ఘటన
  • నిందితుడు నోర్ముయ్ అంటూ దగ్గరికి రావడంతో భయంతో వణికిపోయిన బాలిక
  • మరోమార్గం లేక రైలు నుంచి దూకేసిన చిన్నారి

ఖాళీగా ఉన్న మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తనపై దాడి చేసేందుకే వస్తున్నాడని భయపడిన 13 ఏళ్ల బాలిక కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో జరిగిందీ ఘటన. ఈ ఘటనపై బాలిక తల్లి మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి తనవైపు వస్తుండడంతో తొలుత చైన్ లాగేందుకు ప్రయత్నించిందని, అది కుదరకపోవడంతో మరో మార్గం లేక రైలు నుంచి దూకేసినట్టు తెలిపింది.

జీఆర్పీ పోలీసులతో బాధిత బాలిక మాట్లాడుతూ కోచ్‌లో తాను మాత్రమే ఉన్నానని, ఈలోపు గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని తెలిపింది. ఇది మహిళలకు రిజర్వేషన్ అని, తర్వాతి స్టాపులో దిగేయాలని అతడితో చెప్పానని తెలిపింది.

 దీనికతడు ‘నోర్ముయ్’ అంటూ దగ్గరికి వచ్చాడని, దీంతో అతడు తనపై దాడి చేసేందుకే వస్తున్నాడని బాలిక బయపడిందని జీఆర్పీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మాచింద్ర చావన్ తెలిపారు. రైలు మసీదు బందర్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత అక్కడ కొందరు  పోలీసులు ఉండడాన్ని చూసి మెల్లిగా కదులుతున్న రైలు నుంచి దూకేసిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News