లక్ష్మి పార్వతి: నేను ఏమన్నా పెద్ద అందగత్తెనా, ఎన్టీఆర్ ని ఆకర్షించడానికి?: లక్ష్మీపార్వతి

  • నా సహచర్యంలో ఎన్టీఆర్ రిలాక్స్ అయ్యేవారు
  • మొట్టమొదట ప్రపోజ్ చేసింది ఎన్టీఆరే
  • రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పా: లక్ష్మీపార్వతి

‘నేను ఏమన్నా పెద్ద అందగత్తెనా ఎన్టీఆర్ ని ఆకర్షించడానికి?’ అంటూ దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక’ చిత్రం షూటింగ్ జరుగుతుంటే ఓసారి అక్కడికి వెళ్లా. షూటింగ్ గ్యాప్ లో ఎన్టీఆర్, లక్ష్మి గారు అక్కడ కూర్చుని ఉన్నారు. ‘స్వామీ! నేను వెళ్లొస్తా’ అని చెప్పి బయలుదేరాను.

వెంటనే, అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి ‘మళ్లీ ఎప్పుడొస్తున్నారు?’ అని అడిగారు. ఆయన అలా అడగడం ఎలా ఉందంటే! ఓ తల్లి ఊరెళుతుంటే పిల్లలు అడిగినట్టుగా ఉంది. నేను వెళుతుండటంతో ఆయనలో బాధ, నైరాశ్యం కలిగాయి. అప్పటికే, నాపై ఆయన ఇంత ఆత్మీయత పెంచుకున్నారా! అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కోరుకుంటే లక్ష్మీపార్వతే కాదు, ఏ స్త్రీ అయినా వస్తుంది. నేనేమన్నా పెద్ద అందగత్తెనా ఆయన్ని ఆకర్షించడానికి? లేక, నా వెనుక ఏదైనా రాజకీయం ఉందా? ఆయనకు ఉపయోగపడుతుందని అనుకోవడానికి!’ అని లక్ష్మీపార్వతి అన్నారు.  

‘క్రమేపీ మా మధ్య అనుబంధం బలపడింది. నా సహచర్యంలో ఎన్టీఆర్ రిలాక్స్ అయ్యేవారు. నరసరావుపేటలో నాడు నేను నివసించిన ఇంటికి ఎన్టీఆర్ ఫోన్ పెట్టించారు. ఆ ఫోన్ బిల్లు మూడు లక్షల రూపాయలను ఆయన కట్టారంటే, మా మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థమౌతుంది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్  ప్రపోజ్ చేశారు.

ఓ రోజున నాచారం స్టూడియోలో ఎన్టీఆర్ ఏమన్నారంటే..‘నువ్వు ఒంటరినంటున్నావు.. నేనూ ఒంటరినే. మన మధ్య ఆత్మీయత ఏర్పడింది కదా! మనమెందుకు పెళ్లి చేసుకోకూడదు?’ అని మొదటిసారి ప్రపోజ్ చేశారు. ‘కొంత టైమ్ కావాలి’ అని నేను చెప్పాను. ‘సరే, నీ ఇష్టం’ అన్నారు. రెండు రోజులు ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్ కి ఫోన్ చేసి నా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నాను అని చెప్పాను’ అంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

More Telugu News