payyavula kesav: కేసీఆర్ కు, నాకు సంబంధాలు అంటగట్టడం దారుణం: పయ్యావుల కేశవ్

  • రేవంత్ కు వ్యక్తిగత అజెండానే ముఖ్యం
  • ఆయన సర్టిఫికెట్ నాకు, యనమలకు అవసరం లేదు
  • తెలంగాణలో నాకు వ్యాపారాలు లేవు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్క పనిని కూడా తాను చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి తమ అధినేత చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు.

గత ఆరు నెలలుగా రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని... దానికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. చంద్రబాబును రేవంత్ కలిసిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరే విషయంపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడనని అన్నారు. పార్టీ కంటే వ్యక్తిగత అజెండానే రేవంత్ కు ముఖ్యమని మండిపడ్డారు. తనకు, మంత్రి యనమలకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. నాకు, పరిటాల కుటుంబానికి తెలంగాణలో ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. 

More Telugu News