cricket: భారత్ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న కివీస్ ఆటగాళ్లు...మైదానంలో వాంతులు చేసుకున్న బౌలర్

  • వారం రోజుల క్రితం భారత్ వచ్చిన న్యూజిలాండ్ ఆటగాళ్లు
  • ఎండవేడిమికి తాళలేకపోతున్న కివీస్ ఆటగాళ్లు
  • ఉష్ణతాపం తట్టుకోలేక 21వ ఓవర్ లో వాంతులు చేసుకున్న కొలిన్ డి గ్రాండ్ హోమ్

భారత్ వాతావరణానికి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు అలవాటు పడలేదు. ఎండవేడిమికి తాళలేకపోతున్నారు. వారం రోజుల క్రితం భారత్ వచ్చిన కివీస్ ఆటగాళ్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడారు. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి డే నైట్ వన్డేలో టీమిండియాతో తలపడ్డారు. టీమిండియా టాప్ ఆర్డర్ ను కివీస్ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. పరుగులు పిండుకోకుండా బంతులు సంధించారు.

 ఈ క్రమంలో 21వ ఓవర్‌ ను వేసేందుకు రంగంలో దిగిన కొలిన్ డి గ్రాండ్‌ హోమ్‌ రెండు బంతులు చక్కగా వేశాడు. మూడో బంతి సంధించేందుకు సిద్ధమయ్యే క్రమంలో మోకాళ్లపై చేతులు ఉంచి మైదానంలోనే వాంతులు చేసుకున్నాడు. వెంటనే జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి, అరాతీసి హెల్త్ డ్రింక్ ఇచ్చాడు. అనంతరం కాస్త ఉపశమనం పొందిన గ్రాండ్ హోమ్ ఆ ఓవర్ పూర్తిచేసి పెవిలియన్ బాట పట్టాడు. డ్రెస్సింగ్ రూంలో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌల్ట్ భారత్ లో ఉష్ణతాపం ఎక్కువగా ఉందని, ఆడడం కష్టంగా ఉందని పేర్కొన్నాడు. 

More Telugu News