lakshmis ntr: ఇంటర్వ్యూలో సహనాన్ని కోల్పోయిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత!

  • వెన్నుపోటు పొడవటం మీరు చూశారా? 
  • ఈ సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదు
  • నా దగ్గర డబ్బు లేదని ఎవరు చెప్పారు?

ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి సహనాన్ని కోల్పోయారు. ఇంటర్వ్యూ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని... అందుకే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. దర్శకుడు వర్మలో ఉండే క్రియేటివిటీ చాలా గొప్పదని... అందుకే ఆయనతో సినిమాను తీస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కూడా ఉంటుందా? అనే ప్రశ్నకు బదులుగా... అన్ని విషయాలు ఉంటాయని చెప్పారు. ఈ సినిమా వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కోగలనని... తాను కూడా రాయలసీమలోనే పుట్టానని తెలిపారు. లక్ష్మీపార్వతి పాత్రలో ఎమ్మెల్యే రోజా నటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారని... ఆ సన్నివేశం ఈ సినిమాలో ఉంటుందా? అని రాకేష్ రెడ్డిని యాంకర్ అడిగారు. దీనికి సమాధానంగా వెన్నుపోటు పొడిచింది మీరు చూశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు రాకేష్. అయితే వెన్నుపోటు పొడవలేదని మీరు అంటారా? అని యాంకర్ ప్రశ్నించగా... సహనాన్ని కోల్పోయిన రాకేష్ రెడ్డి ఆ విషయాన్ని సినిమాలోనే చూడాలని ఒకింత ఆగ్రహంగా చెప్పారు.

తాను సినిమా గురించి మాట్లాడటానికే ఇక్కడకు వచ్చానని... రాజకీయాల గురించి మాట్లాడటానికి రాలేదని స్పష్టం చేశారు. వైసీపీకి, ఈ సినిమా నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాకేష్ రెడ్డి వద్ద సినిమా తీసేంత డబ్బు లేదని... ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నది జగన్ అనే ఆరోపణలు ఉన్నాయన్న ప్రశ్నకు బదులుగా... తన వద్ద డబ్బు లేదని నిరూపిస్తే మీరు ఏం చెప్పినా చేస్తానని... నిరూపించలేకపోతే చానల్ ను క్లోజ్ చేసుకోవాలని అన్నారు.

More Telugu News