by ramaiah: బుట్టా రేణుకపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు!

  • జగన్ వెంటే ఉంటానని చెప్పిన మాటలు ఏమయ్యాయి?
  • పార్టీ మారిన వారికి టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతుందో తెలుసుకోవాలి
  • టీడీపీ కార్యకర్తలు కూడా మర్యాద ఇవ్వరు

కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో ఆమెపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని గతంలో రేణుక చెప్పారని... ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపుదార్లకు టీడీపీలో ఎంత గౌరవం దక్కుతుందన్న విషయాన్ని రేణుక తెలుసుకోవాలని అన్నారు. పార్టీ మారినవారికి టీడీపీ కార్యకర్తలు ఎలాంటి మర్యాద ఇస్తున్నారన్న విషయాన్ని గమనించాలని చెప్పారు.

తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ... మరి, తను ఎంపీగా గెలిచిన మూడో రోజే ఆమె భర్త టీడీపీ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెందుంటామో గుర్తించాలని రామయ్య అన్నారు. విపక్ష నేతలను సంతలో పశువుల మాదిరిగా కొనడమే పనిగా పెట్టుకున్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ నేతల్లో దడ మొదలైందని అన్నారు. వైసీపీలో ప్రజాదరణ కలిగిన నేతలకు కొదవలేదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని తెలిపారు.

More Telugu News