Student: హరియాణాలో విద్యార్థి ఘాతుకం.. మార్కులు తక్కువ వేశాడని తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై కొడవలితో దాడి!

  • మందలించిన ఉపాధ్యాయుడిపై దాడి
  • ప్రాణాపాయ స్థితిలో టీచర్
  • పోలీసుల అదుపులో విద్యార్థి

గణితంలో మార్కులు తక్కువగా వస్తున్నాయేమని అడిగిన ఉపాధ్యాయుడిపై కొడవలితో విచక్షణ రహితంగా దాడిచేశాడో విద్యార్థి. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా బహదూర్‌మార్గ్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థి (17) గణితంలో చాలా వెనకబడి ఉండడంతో ఉపాధ్యాయుడు రవీందర్ పలుమార్లు అతడిని మందలించాడు. ఈసారి మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ మీటింగ్‌లో తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించాడు.

ఉపాధ్యాయుడి హెచ్చరికలతో కక్ష పెంచుకున్న విద్యార్థి తరగతి గదిలో పరీక్ష పేపర్లు దిద్దుతున్న ఉపాధ్యాయుడిపై కొడవలితో దాడి చేశాడు. పలుమార్లు విచక్షణ రహితంగా తలపై నరికాడు. తీవ్ర గాయాలపాలైన ఉపాధ్యాయుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News