ఉత్తరకొరియా: మరో దుందుడుకు చర్యకు పాల్పడడానికి రంగం సిద్ధం చేసుకున్న ఉత్తరకొరియా
- యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోన్న ఉత్తరకొరియా
- అమెరికా హెచ్చరికల నేపథ్యంలో మరో క్షిపణి పరీక్షకు సిద్ధం
- వచ్చే వారం అమెరికా, ద.కొరియా సంయుక్తంగా నావికా దళ విన్యాసాలు
యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోన్న ఉత్తరకొరియా పరిస్థితి ఏదో ఒకటి చేయాల్సిన దశకు చేరుకుందని, ఇక నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు వచ్చే వారం అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా నావికా దళ విన్యాసాలు చేపట్టనున్నాయి. దీంతో ఉత్తరకొరియా మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుందని దక్షిణ కొరియా మీడియా ద్వారా తెలిసింది.
ఉత్తరకొరియా మధ్యంతర స్థాయి క్షిపణులను ప్రయోగించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి. హవసాంగ్-14 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)తో పాటు హవసాంగ్-13 ఐసీబీఎంను కూడా ఉత్తరకొరియా పరీక్షించే అవకాశం ఉంది. ఈ క్షిపణి యూఎస్ వెస్ట్ కోస్ట్ను చేరుకోగలదు. దీంతో అంతర్జాతీయంగా మరోసారి ఆందోళన నెలకొంది.