cricketer: కట్నం కోసం మరోసారి భార్యను వేధిస్తున్న బంగ్లా క్రికెటర్!

  • 20 లక్షల టాకాల అదనపు కట్నం తేవాలని వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన క్రికెటర్ అరాఫత్ సన్నీ భార్య
  • రెండు సార్లు అరెస్టైన అరాఫత్ సన్నీ

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ అరాఫత్‌ సన్నీ మరోసారి అరెస్టు కానున్నట్టు తెలుస్తోంది. 2014 డిసెంబర్‌ 4న నస్రీన్‌ సుల్తానాతో అరాఫత్ సన్నీకి వివాహమైంది. ఈ సందర్భంగా నస్రీన్ సుల్తానా తల్లిదండ్రులు వరకట్నంగా బంగ్లా కరెన్సీలో 5.1 లక్షల టాకాలను ఇచ్చారు. కొన్నాళ్లు సజావుగా సాగిన కాపురంలో వేధింపులు ఆరంభమయ్యాయి. 20 లక్షల టాకాలు తీసుకురావాలని సన్నీ, అతని తల్లి ఆమెను వేధించడం ఆరంభించారు. దీంతో ఆమె ఈ ఏడాది జనవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అదేనెల 22న అతనిని అరెస్టు చేశారు. అనంతరం వివాదం పరిష్కరించుకున్నామని చెప్పడంతో మార్చిలో అతనిని బెయిల్ పై విడుదల చేశారు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి జూలై 16న అతనిని అరెస్టు చేశారు. ఆ సమయంలో సన్నీకి జైలులో చికున్ గున్యా వ్యాధి రావడంతో మళ్లీ బెయిల్ పై విడుదలయ్యాడు. తాజాగా మరోసారి అవే ఆరోపణలు రావడంతో అక్టోబర్‌ 12న ఈ కేసును పోలీసులు రీఓపెన్‌ చేశారు. ఈసారి కూడా అరాఫత్ సన్నీ జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 

More Telugu News