కంచ ఐలయ్య: నా పుస్తకాలన్నీ సొంత ఖర్చుతో రీసెర్చ్ చేసి రాసుకున్నవే!: ప్రొఫెసర్ కంచ ఐలయ్య

  • ఏ క్రిస్టియన్ సంస్థ నుంచి డబ్బులు తీసుకోలేదు
  • ఆ అవసరం నాకు లేదు..నాకు మంచి జీతం వస్తుంది
  • బిషప్స్ తో, స్వామీజీలతో నాకు కొట్లాట ఉంది
  • కౌటిల్యుని భరతం పట్టడమే నా లక్ష్యం

తాను రాసిన పుస్తకాలన్నీ సొంత ఖర్చుతో రీసెర్చ్ చేసి రాసుకున్నవేనని, ఏ క్రిస్టియన్ సంస్థ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని.. తనకు ఆ అవసరం కూడా లేదని కంచ ఐలయ్య అన్నారు. తనకు మంచి జీతం వస్తోందని, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుందని చెప్పారు.

ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘బిషప్స్ ని నేను అడిగా.. ‘మీరు స్థాపించిన కాలేజీలు మూసి వేయండి. మీ ఆస్తులను అమ్మండి, మీకు పట్టణాల్లో ఆస్తులు ఏ దేవుడిచ్చాడు?  గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఆదివాసీలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తే, అప్పుడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు’ అని వారికి చెప్పాను. అలా చెప్పినందుకు వాళ్లతో కూడా నాకు కొట్లాట ఉంది. స్వామీజీలతోనూ నాకు కొట్లాట ఉంది’ అని అన్నారు.

‘అందరితో కొట్లాట పెట్టుకుని ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు ఐలయ్య స్పందిస్తూ, ‘కొట్లాట పెట్టుకుని ఆఖరికి మట్టిలో కలుస్తా. నేను రాసిన పెన్నును పదివేల సంవత్సరాల పాటు కౌటిల్యుడికి అడ్డంగా నిలబెట్టి పోవాలని చూస్తున్నా. కౌటిల్యుని భరతం పట్టడమే నా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News