ram gopal varma: రామ్ గోపాల్ వర్మపై నటి వాణీ విశ్వనాథ్ ఫైర్.. ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ వార్నింగ్

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరులోనే వ్యాపారం ఉంది
  • ఈ సినిమాపై అనుమానాలున్నాయి
  • సినిమా తీయడాన్ని వర్మ మానుకుంటే మంచిది

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు వర్మపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా... తాజాగా, టీడీపీలో చేరుతానని ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ మండిపడ్డారు. సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలని అన్నారు. ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే, చూస్తూ ఊరుకోబోమని... వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ లో రాముడిని, కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారని అన్నారు.

ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని తెలిపారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తీయబోయే సినిమాపై అనుమానాలున్నాయని అన్నారు. కేవలం దురుద్దేశంతోనే వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని మండిపడ్డారు. సినిమాను గొప్పగా తీస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఈ సినిమా తీయడం మానేయాలని వర్మను తాను కోరుతున్నానని చెప్పారు. 

More Telugu News