టీఆర్ఎస్: టీఆర్ఎస్ - టీడీపీ పొత్తులపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం: మంత్రి తుమ్మల

  • ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదు
  • పొత్తు అవసరమని మేం భావించడం లేదు
  • ఓ ఇంటర్వ్యూలో తుమ్మల వెల్లడి

టీఆర్ఎస్-టీడీపీ పొత్తు గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పొత్తుల విషయమై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని, అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని అన్నారు. టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు అవసరమని తాము భావించడం లేదని చెప్పారు.

పొత్తుల విషయమై ఇప్పటికే కేసీఆర్, చంద్రబాబు మధ్య తాను మధ్యవర్తిత్వం చేశాననే విషయాన్ని తుమ్మల ఖండించారు. మధ్యవర్తిత్వం వహించిన మాట వాస్తవమే కానీ, పొత్తుల గురించి కాదని, రెండు రాష్ట్రాల మధ్య ఎక్స్ ప్రెస్ హై వేలు, ప్రాజెక్టుల విషయం గురించి మాట్లాడానని, రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని, ఐక్యంగా ఉండాలనే అంశాలు తప్పా, రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడిన అంశాలు తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణమనేది ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే చేస్తున్నారనే ప్రతిపక్షాల ఆరోపణపై తుమ్మల స్పందిస్తూ, ప్రజాహితంతో, ప్రజల కష్టసుఖాలతో, వారి అవసరాలతో ప్రతిపక్షాలకు సంబంధం లేదని మండిపడ్డారు. 

More Telugu News