asish nehra: నిన్నటిదాకా ముసలోడికి చోటెందుకన్నారు, ఇప్పుడు భావోద్వేగాన్ని చూపుతున్నారు... నెహ్రా రిటైర్ మెంట్ ప్రకటనతో మారిన సీన్!

  • నవంబర్ 1 న నెహ్రా ఆఖరు అధికారిక క్రికెట్ మ్యాచ్
  • న్యూజిలాండ్ తో టీ-20 తరువాత రిటైర్ మెంట్
  • విమర్శలు వదిలి, సేవలను గుర్తు చేస్తున్న నెటిజన్లు

నాలుగు పదులకు చేరువైన వయసులో భారత క్రికెట్ జట్టులో మళ్లీ స్థానం సంపాదించాలంటే అంత సులువేమీ కాదు. దాదాపు అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఆశిష్ నెహ్రా. ఆస్ట్రేలియాతో టీ-20 సిరీస్ కు నెహ్రాను ఎంపిక చేశారన్న విషయం వెల్లడి కాగానే, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో ఎటువంటి కామెంట్లు వచ్చాయో అందరికీ తెలిసిందే.

యువరాజ్, అశ్విన్ వంటి వారిని పక్కనబెట్టి, నెహ్రాను తీసుకోవడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముసలోడికి జట్టులో చోటెందుకని తిట్టిన వాళ్లూ ఉన్నారు. ఇక తాను నవంబర్ 1న న్యూఢిల్లీలో తన హోమ్ గ్రౌండ్ అయిన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్ తో జరిగే టీ-20 తరువాత ఆటకు విరామం ఇవ్వనున్నట్టు నెహ్రా చెప్పిన తరువాత పరిస్థితి మారిపోయింది. భారత జట్టుకు సుదీర్ఘకాలంగా నెహ్రా చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్న అభిమానులు భావోద్వేగంతో వీడ్కోలు వ్యాఖ్యలు చెబుతున్నారు.

ఏదైనా వికెట్ తీస్తే, రెండు చేతులూ చాచి, విమానంలా నెహ్రా పరిగెడతాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. "నీ ఏరోప్లేన్ సెల్బ్రేషన్స్ ఇక చూడలేమేమో" అని ఒకరంటే, "నమ్మశక్యం కాని రీతిలో జట్టులోకి వచ్చి, ఘనమైన వీడ్కోలును అందుకోనున్నావు. భారత క్రికెట్ కు నువ్వో గొప్ప బహుమతివి" అని మరొకరు, "40 ఏళ్ల వయసులో జట్టులోకి రావడమంటే మాటలు కాదు" అని ఇంకొకరు... ఇలా నెహ్రాకు అభినందనలు, వీడ్కోలు తెలుపుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News