sasikala: శశికళ... బ్యాక్ టూ పరప్పన అగ్రహార జైలు!

  • భర్త అనారోగ్యం పేరిట పెరోల్ పొందిన శశికళ
  • భర్తను కలిసింది గంటల సమయమే
  • సొంత పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపణలు
  • తిరిగి బెంగళూరు బయలుదేరిన శశి

తన భర్త అనారోగ్యంతో ఉన్నారని, చూసి వస్తానని కోరుతూ ఐదు రోజుల పెరోల్ కు అనుమతి తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ, తిరిగి జైలుకు బయలుదేరారు. తనకిచ్చిన ఐదు రోజుల పెరోల్ ముగిసిన తరువాత, ఈ ఉదయం ఆమె చెన్నై నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు బయలుదేరారు. అంతకుముందు తనకు మద్దతు పలికేందుకు వచ్చిన అసంఖ్యాక కార్యకర్తలు, నేతలకు అభివాదం చేశారు.

కాగా, కోర్టు ఐదు రోజుల పెరోల్ కు షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా, ఆమె నిబంధనలను అతిక్రమించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పెరోల్ లో భాగంగా ఆమె రెండు రోజుల పాటు మాత్రమే ఆసుపత్రికి వెళ్లి భర్త నటరాజన్ ను పరామర్శించిందని, మిగతా సమయమంతా పార్టీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిని పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

ఆమె ఆసుపత్రిలో మొత్తం మీద ఐదారు గంటల కన్నా ఎక్కువ సమయం లేదని సమాచారం. ఇంట్లో మాత్రం దినకరన్ సహా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఆమెను కలిసినట్టు తెలుస్తుండగా, న్యాయ నిపుణులు కూడా శశికళను కలిసిన వారిలో ఉన్నారు. ఆమె సాయంత్రానికి పరప్పన అగ్రహార జైల్లో రిపోర్టు చేయనున్నారు.

More Telugu News