టీటీడీ: టీటీడీలో కాంట్రాక్టు క్షురకుల తొలగింపుపై నిరసన!

  • ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా తొలగించారు
  • వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
  • జేఈఓకు వినతిపత్రం సమర్పించిన కాంట్రాక్ట్ క్షురకులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కాంట్రాక్టు క్షురకులను తొలగించడంపై వివాదం నెలకొంది. డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై 240 మంది కాంట్రాక్టు క్షురకులను టీటీడీ తొలగించడాన్ని నిరసిస్తూ ఆలయ జేఈవోకు క్షురకులు ఈ రోజు ఓ వినతిపత్రం సమర్పించారు. తొలగించిన కాంట్రాక్టు క్షురకులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. తమపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకున్నారని కాంట్రాక్టు క్షురకులు ఆరోపించారు.

 ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు మాట్లాడుతూ, కాంట్రాక్టు క్షురకులకు టీటీడీ ఎటువంటి జీతాలు చెల్లించదని, ప్రతి టిక్కెట్ పై కొంత మొత్తం మాత్రమే ఇస్తుందని చెప్పారు. తలనీలాలు సమర్పించే భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చే డబ్బులనే వారు తీసుకుంటున్నారు తప్పా, ఎటువంటి ఒత్తిడి చేసి తీసుకోవడం లేదని చెప్పారు. భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చే డబ్బులను లంచాలుగా పరిగణించడం తగదని అన్నారు.

More Telugu News