cbi: సొంత తమ్ముడి కేసు విచారణ... సీబీఐ 'ఫైనాన్షియల్ ఫ్రాడ్' బాస్ ను తప్పించిన డైరెక్టర్!

  • బ్యాంకింగ్ మోసాలను విచారిస్తున్న రాజీవ్ సింగ్
  • అలహాబాద్ బ్యాంకు నుంచి ఫిర్యాదు
  • సోదరుడు సంజీవ్ ను విచారించాల్సిన పరిస్థితి
  • కేసు నుంచి పక్కకు తప్పించిన సీబీఐ

భారత ప్రీమియం ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీగా ఉన్న సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లోని కీలక విభాగమైన బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ ఎంక్వయిరీ వింగ్ కు ఓ సమస్య ఎదురు కాగా, ఆ విభాగం బాస్ ను పక్కకు తప్పించారు. సీబీఐ విచారణకు వచ్చే బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీస్ మోసాల కేసులను త్రిపుర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ చూస్తున్నారు. ఆయనకు గత సంవత్సరం శారదా స్కామ్ విచారణను సమర్థవంతంగా జరుపుతున్నందుకు రాష్ట్రపతి మెడల్ కూడా వచ్చింది. ఆయనకు త్వరలోనే ప్రమోషన్ రావచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సమయంలో అలహాబాద్ బ్యాంకులోని ఓ శాఖలో రూ. 6 కోట్ల మేరకు మోసం జరిగిందని ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదులో భాగంగా సంజీవ్ సింగ్ అనే వ్యక్తి, తనకు లేని ఆస్తిని చూపించి రుణం తీసుకున్నాడన్న ఫిర్యాదు సీబీఐకి రాగా, ఈ సంజీవ్, స్వయానా రాజీవ్ సింగ్ కు తమ్ముడేనని తేలింది. సోదరుడిపై పక్షపాతం చూపుతాడని కాకున్నా, నిబంధనల మేరకు సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా, ఈ విభాగం నుంచి రాజీవ్ సింగ్ ను పక్కకు తప్పించారు. ఈ కేసు విచారణకు రాజీవ్ సింగ్ నేతృత్వం వహించడం లేదని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News