amezon: ఫోన్లు ఆర్డరివ్వడం... రిఫండ్ వేయించుకోవడం..: అమెజాన్ ను 166 సార్లు మోసం చేసిన యువకుడు!

  • ఖరీదైన ఫోన్లు ఆర్డర్ ఇవ్వడమే ఢిల్లీ యువకుడి పని
  • డబ్బు కట్టేసి, ఖాళీ బాక్స్ వచ్చిందని ఫిర్యాదు
  • పాలసీ ప్రకారం రిఫండ్ చేసే అమెజాన్
  • రూ. 50 లక్షలు పోయిన తరువాత మేలుకొన్న సంస్థ

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 166 ఖరీదైన ఫోన్లను ఆర్డర్ చేసి ఆన్ లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ ను భారీ ఎత్తున ముంచేశాడో 21 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు. అది కూడా రెండు నెలల వ్యవధిలోనే. అతను చేసిన నష్టం రూ. 50 లక్షలను దాటిన తరువాత అమెజాన్ విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, శివమ్ చోప్రా అనే యువకుడు హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేశాడు. కానీ సరైన నైపుణ్యం లేక ఉద్యోగం సంపాదించడంలో విఫలమయ్యాడు. ఈ సంవత్సరం మార్చిలో అతనికి ఓ ఐడియా వచ్చింది. అమెజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. ఫోన్లు వచ్చిన తరువాత రిఫండ్ కోరగా, డబ్బులు అతని ఖాతాలో జమ అయ్యాయి. ఇంతకీ శివమ్ ఇక్కడేం ప్లాన్ వేసి విజయం సాధించాడో తెలుసా?...

అమెజాన్ నుంచి యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లను వేరేవేరే ఫోన్ నంబర్లు, చిరునామాల నుంచి ఆర్డర్ ఇచ్చేవాడు. అతనికి సిమ్ కార్డులను సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికం స్టోర్ ఓనర్ సహకరించాడు. ఏకంగా 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ లను శివమ్ కు ఇచ్చాడు. వాటిని ఉపయోగిస్తూ ప్రొడక్టులను శివమ్ కొనేవాడు.

ఓ తప్పుడు చిరునామాతో తొలుత ఆర్డర్ చేసే శివమ్, ఆపై సదరు ప్రొడక్టు డెలివరీ చేసేందుకు వచ్చే బాయ్, ఆ చిరునామాలో లేరని తెలుసుకుని కాల్ చేయగా, సమీపంలోనే మరో చోట ఉండే శివన్ తన డ్రామాకు తెరలేపేవాడు. చిరునామా మారిందని, ఫలానా చోటకు రావాలని చెప్పి ఓ రెండు మూడు సందులు తిప్పించి అతన్ని కలిసి డెలివరీ తీసుకునేవాడు. డెలివరీ బాయ్ అలా వెళ్లగానే, తన రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి అమెజాన్ కు కాల్ చేసి, ఖాళీగా ఉన్న ఫోన్ డబ్బా తనకు ఇచ్చి వెళ్లారని ఫిర్యాదు చేసేవాడు. అప్పటికే శివమ్ డబ్బులు చెల్లించినట్టు వారి వద్ద సమాచారం ఉంటుంది కాబట్టి, కంపెనీ పాలసీ ప్రకారం వెంటనే రిఫండ్ లభిస్తుంది. అమెజాన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, 12 లక్షల నగదు, 40 బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్కులు సీజ్ చేశారు.

More Telugu News