love marriage: సినిమా ఫక్కీలో చేజింగ్... కళ్లల్లో కారం చల్లి, కూతుర్ని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు!

  • పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్న సిరిచందన
  • బెదిరింపులతో ఎస్పీని ఆశ్రయించిన నవీన్, సిరిచందన
  • చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో హౌస్ సర్జన్ లుగా పని చేస్తున్న నవీన్, సిరి చందన
  • రెండు ఇన్నోవాల్లో వెంబడించి, కిడ్నాప్

కులాంతర వివాహం కన్నవారికి కంటగింపుగా మారడంతో భర్త కళ్లల్లో కారం చల్లి, భార్యను ఎత్తుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ దగ్గర చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... తిరుపతికి చెందిన నవీన్ కుమార్, అతని చెల్లి, సిరిచందన ముగ్గురూ చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌ లుగా పనిచేస్తున్నారు. ఒకేచోట పని చేయడంతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను సిరిచందన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి గత ఆగస్టు 16న ఒక గుడిలో వీరు కులాంతర వివాహం చేసుకున్నారు.

అనంతరం సిరిచందన కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు రావడంతో వారిద్దరూ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. వివాదం సమసిపోయిందని, అంతా సజావుగా సాగుతుందనుకున్నంతలో ఆసుపత్రిలో విధులు ముగించుకుని చెల్లెలు, భార్యతో కలిసి బైక్ పై నవీన్ వెళ్తున్న సమయంలో.. రెండు ఇన్నోవా కార్లలో వెంబడించిన 15 మంది చంద్రగిరి మండలం, తొండవాడ సమీపంలో వారిపై దాడికి దిగి, వారి కళ్లల్లో కారం చల్లి, సిరిచందనను వెంటతీసుకెళ్లిపోయారు.

అటుగా వచ్చిన స్థానికులు నవీన్, అతని చెల్లెలిని ఆసుపత్రికి తరలించి కాపాడారు. అనంతరం నవీన్ తన భార్యను కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు రాజభూపాల్ రెడ్డి, పార్వతమ్మలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. సిరిచందన కోసం గాలింపు చేపట్టారు. 

More Telugu News