rajasekhar: మీకు నన్ను తిట్టాలని ఉంది... నేను పక్కనుంటాను.. తిట్టండి: 'యాక్సిడెంటు' సమయంలో బాధితుడితో రాజశేఖర్

  • పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదానికి కారణమైన రాజశేఖర్
  • రాజశేఖర్ మాటలతో నవ్వేసిన బాధితుడు
  • హుందాగా ప్రవర్తించిన రాజశేఖర్

హైదరాబాదు, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై సినీ నటుడు రాజశేఖర్, రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే రాజశేఖర్ తన కారును ఢీ కొట్టాడని ఆరోపిస్తూ మండిపడ్డారు. 'తాగిలేవని చెప్పవద్దు...అది డాక్టర్లు తేల్చాల్సిన పని' అంటూ మండిపడ్డారు. దీంతో కల్పించుకున్న రాజశేఖర్.. 'మీరు నన్ను తిట్టాలని నిర్ణయించుకుంటే తిట్టండి... పక్కనే నిల్చుంటాను' అంటూ పక్కకెళ్లారు.

దీంతో అంతవరకు కోపం వ్యక్తం చేసిన బాధితుడు కూడా నవ్వేశారు. ఇంతలో 'నేను తాగలేదు, ఒత్తిడిలో ఉండడంతో అలా జరిగిపోయింది. అంతే తప్ప చేయాలని చేసింది కాదు' అంటూ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. అయినా రాంరెడ్డి శాంతించలేదు.. 'సినీ హీరో రాజశేఖర్ గా మీపై నాకు గౌరవముంది. కానీ ఇలా వేరే ఎవరినో గుద్దేస్తే, వారికి ఏదైనా జరిగితే బాధ్యత ఏంటి? మీరు శిక్షార్హులా? కాదా?' అంటూ నిలదీశారు.

ఆయన మాటలతో ఏకీభవించిన రాజశేఖర్ 'నిజమే.. మీకు ఏది న్యాయమనిపిస్తే అది చేయండి, నేను అడ్డుపడను' అంటూ హుందాగా ప్రవర్తించారు. దీంతో సమస్య పరిష్కారమవడానికి మార్గం సుగమమైంది. 

More Telugu News