bahubali: ఒకే సింహాసనంపై బాహుబలి, భల్లాలదేవుడు... రాజమౌళి టీమ్ రిలీజ్ చేసిన పిక్ ఇది!

  • నేడు బుల్లితెరపై బాహుబలి-2
  • ప్రమోషన్ చేస్తున్న చిత్ర టీమ్
  • సాయంత్రం 5 గంటలకు 'స్టార్ మా'లో

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన 'బాహుబలి-2' నేడు మరో పరీక్షను ఎదుర్కోనుంది. నేడు ఈ చిత్రం తొలిసారిగా బుల్లితెరపై ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంత మంది చూస్తారు? టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుందన్న విషయమై ఎవరి అంచనాలను వారు వేస్తున్నారు. ఎందుకంటే, వెండితెరపై విఫలమై, టీవీ చానళ్లలో సూపర్ హిట్టయిన 'ఖలేజా', 'అతడు' వంటి చిత్రాలతో పాటు రూ. 100 కోట్ల కలెక్షన్లను దాటి టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నెంబర్ 150' వంటి చిత్రాల చరిత్ర విశ్లేషకులకు తెలుసుకాబట్టి. 'అతడు' చిత్రం టీవీలో కొన్ని పదుల సార్లు ప్రసారమైంది. ఇప్పటికీ ఆ చిత్రం వస్తుంటే, చానల్ మార్చకుండా చూస్తుండి పోతుంటారు వీక్షకులు. ఎంతో హిట్టయిన చిత్రాలు వస్తుంటే పక్కకు తిప్పేస్తారు కూడా.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బుల్లితెరపైనా సూపర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి టీమ్, అందుకు ప్రమోషన్ గా ఓ వెరైటీ పిక్ ను విడుదల చేసింది. ఒకే సింహాసనంపై బాహుబలి, భల్లాలదేవుడు కూర్చున్న పిక్ ను చిత్ర టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ చిత్రం నేటి సాయంత్రం 5 గంటలకు 'స్టార్ మా' టీవీ చానల్ లో ప్రసారం కానుంది. భల్లాలదేవుడి ఒడిలో బాహుబలి కూర్చున్న ఈ పిక్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News