naveena: కలకలం రేపుతున్న ట్రయినీ కానిస్టేబుల్ నవీన మృతి!

  • శిక్షణ పొందుతూ ఉరేసుకుని మృతి!
  • అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు
  • విచారిస్తున్నామన్న పోలీసులు

హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతున్న నవీన అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. నల్గొండ జిల్లాకు చెందిన నవీన, నగర పరిధిలోని రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి శిక్షణా కేంద్రంలో కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతోంది. నిన్న కూడా శిక్షణకు హాజరైన ఆమె, గత రాత్రి తన హాస్టల్ గదిలోనే విగతజీవిగా కనిపించింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తుండగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

ఆమె మృతికి కారణాలపై ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని తెలుస్తోంది. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో విచారిస్తున్నామని, ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లను, శిక్షణా కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజ్ లనూ పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, నిన్న నవీన స్నేహితురాలు ఒకరు ఆత్మహత్య చేసుకుని మరణించగా, ఆ మరునాడే నవీన మరణించడం గమనార్హం.

More Telugu News