jai: 'జై'ని రెండు రోజుల్లో అరెస్టు చేయండి... 'జర్నీ' హీరోపై కోర్టు ఆదేశం

  • తాగిన మత్తులో అడయారు వంతెనను ఢీ కొట్టిన జై
  • అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు
  • కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం
  • రెండు రోజుల్లో అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చాలని ఆదేశం

'జర్నీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, 'రాజా-రాణి' సినిమాతో ఆకట్టుకున్న జైని అరెస్టు చేయాలని చెన్నైలోని సైదాపేట న్యాయస్థానం ఆదేశించింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఈ మధ్యే తాగిన మత్తులో అడయారు వంతెనను జై ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు.

ఈ కేసుపై సైదాపేట కోర్టులో విచారణ జరుగుతోంది. రెండు సార్లు విచారణ జరుగగా జై కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై న్యాయమూర్తి అబ్రహాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో జైని అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం ఈ కేసును వచ్చేవారానికి వాయిదా వేశారు.

అరెస్టు వారంట్ పట్టుకున్న పోలీసులు, పరారీలో ఉన్న జై కోసం గాలింపు చేపట్టారు. కాగా, తెలుగు హీరోయిన్ అంజలిని జై వివాహం చేసుకోనున్నాడంటూ కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 'జర్నీ' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. 

More Telugu News