fake baba: బాబా ముసుగులో మరో కీచకుడు... మత్తుపానీయం ఇచ్చి అత్యాచారం!

  • స్వస్థలంలో వదిలిపెడతానంటూ వంచించిన బాబా అనుచరుడు
  • మార్గమధ్యంలో మత్తు పానీయం ఇచ్చి అతిథి గృహానికి తీసుకెళ్లిన వైనం 
  • అతిథిగృహంలో యువతిపై అత్యాచారం చేసి, బెదిరించిన బాబా 

బాబాల ముసుగులో రోజుకో కీచకుడు పంజా విసురుతూ తమను నమ్మిన భక్తులపైనే దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా అలాంటి ఓ దుర్మార్గుడు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి గోవా రాష్ట్రంలోని వాస్కో నగరానికి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రంలో స్వయం ప్రకటిత బాబా (కుందాపూర్ బాబా) అనుచరుడైన సంతోష్ కుంభార్ అనే వ్యక్తి అక్కడ ఆ యువతికి పరిచయమయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పి, తన స్వస్థలంలో వదిలిపెడతానంటూ కారులో ఎక్కించుకున్నాడు. ప్రయాణం మధ్యలో మత్తు మందు కలిపిన పానీయాన్ని ఆమెతో తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరువాత వాస్కో నగరంలోని ఒక అతిధి గృహానికి తీసుకువెళ్లాడు.

అక్కడ కుందాపూర్ బాబాకు యువతిని అప్పగించి, బయటకు వెళ్లాడు. దీంతో బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్రపరిణామాలు ఉంటాయని బాబా ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన గోవా పోలీసులు, పరారీలో ఉన్న కీచక బాబా కోసం గాలింపు చేపట్టారు. 

More Telugu News