acb raids: అప్పుడు స్వీపరే... అవినీతితో ఇప్పుడు 50 కోట్లకు అధిపతి అయ్యాడు!

  • స్వీపర్ గా 1985లో విధుల్లో చేరిన వెంకటనారాయణ రెడ్డి
  • మూడు ప్రమోషన్లు, 50 కోట్ల రూపాయల అవినీతి
  • ఏసీబీ దాడుల్లో అవినీతి బట్టబయలు

ఏపీలో కరువు జిల్లాగా పేరొందిన అనంతపురంలో అవినీతి జలగ బయటపడింది. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని బత్తలపల్లికి చెందిన వెంకట నారాయణరెడ్డి 1985లో స్వీపర్‌ గా ఐసీడీఎస్ లో చేరాడు. ఆ తరువాత ఆఫీస్‌ సబార్డినేట్‌ (అటెండర్‌), మరికొన్నేళ్లకి జూనియర్‌ అసిస్టెంట్‌, ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంట్‌ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్వీపర్ గా జాయిన్ అయిన మొదట్లో బాగానే ఉన్న నారాయణ రెడ్డి నెమ్మదిగా అవినీతిని ఒంటబట్టించుకున్నాడు. చిన్నపిల్లల పౌష్టికాహారాన్నీ తినేయడం మొదలుపెట్టి, ఐసీడీఎస్ లో అవినీతి తిమింగలమయ్యాడు.

అనంతపురం, ధర్మవరం, పెనుకొండల్లో భవనాలు నిర్మించాడు. రైతులకు అప్పులిచ్చి వారి వ్యవసాయ భూములు, ఇళ్లు, ఇతరత్రా స్థిరాస్తులు బలవంతంగా రాయించుకున్నాడు. అతని నివాసంతో పాటు అతని బంధువుల నివాసాలపై జరిపిన తనిఖీల్లో రాప్తాడు మండలానికి సంబంధించి ఓ రైతు భూమి, అనంతపురంలో మరో ఇల్లు, మరోచోట నివాస స్థలాన్ని ఇలాగే రాయించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే భారీగా నగదు, నగలు, కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద సుమారు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించినట్టు వారు వెల్లడించారు. 

More Telugu News