shaini: శంషాబాద్ లో కిడ్నాపైన చిన్నారి షైనీ క్షేమం.. నిందితుల అరెస్టు

  • ఐదు రోజుల క్రితం కిడ్నాపైన షైనీ కథ సుఖాంతం
  • రాణి నివాసం ఎదురుగా ఉండే హంసే కిడ్నాపర్
  • మైలార్ దేవ్ పల్లిలో కిడ్నాపర్ల గుర్తింపు

హైదరాబాదులోని శంషాబాద్ లో కిడ్నాప్ కు గురైన నాలుగు నెలల చిన్నారి షైనీని పోలీసులు క్షేమంగా తల్లిఒడి చేర్చారు. సిద్ధాంతి బస్తీలో నివాసం ఉండే రాణి, నరేందర్ దంపతుల దత్తపుత్రిక షైనీ ఐదు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు తెలిసినవారే షైనీని ఎత్తుకెళ్లారని భావించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

రాణి నివాసం ఎదురుగా ఉన్న హంస, చంద్రకాత్ కలసి షైనీని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వారు శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. మైలార్ దేవ్ పల్లిలో తలదాచుకున్న హంస, చంద్రకాత్ లతో షైనీని గుర్తించి, వారిని పట్టుకున్నారు. అనంతరం చిన్నారి షైనీని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. షైనీతో పాటు డబ్బు, బంగారం కూడా వారు తీసుకెళ్లిపోయినట్టు గుర్తించిన పోలీసులు, వాటిని రికవరీ చేశారు. షైనీకి హాని చేసేందుకు వారు కిడ్నాప్ చేయలేదని, పాపను పెంచుకునేందుకే కిడ్నాప్ చేశారని చివరికి పోలీసులు విచారణలో తేల్చారు. 

More Telugu News