Hyderabad: హైదరాబాదులో కురిసిన వర్షం రాజమౌళికి నష్టాన్ని మిగిల్చింది!

  • మణికొండ పంచవటి కాలనీలోకి ప్రవేశించిన నీరు
  • 'బిగ్ బాస్' విజేత శివబాలాజీ అపార్ట్ మెంట్ సెల్లార్ నీట మునిగింది
  • రాజమౌళి గెస్ట్ హౌస్ ను ముంచెత్తిన వరదనీరు.. దెబ్బతిన్న మినీ థియేటర్
  • రోజా ఇంటి రోడ్డుపై మూడడుగులకు పైగా నిలిచిన నీరు

హైదరాబాదు, మణికొండలోని పంచవటి కాలనీని పాష్ ఏరియాగా పేర్కొంటారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ తరహాలో ఇక్కడా సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు నివసిస్తుంటారు. విలాసవంతమైన అపార్ట్‌ మెంట్లు, డ్యూప్లేక్స్ ఇళ్లు, వెడల్పాటి రహదారులు, సుందరమైన పార్కులు, పచ్చని చెట్లు, ప్రముఖుల రాకపోకలతో ఈ ప్రాంతం రిచ్‌ గా కనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రాంతం మొన్న, నిన్న కురిసిన వర్షాలకు చెరువులా మారింది. ఈ కాలనీలో నివాసముండే దర్శకుడు రాజమౌళికి నష్టాన్ని మిగల్చగా, నటి, ఎమ్మెల్యే రోజా, నటుడు శివబాలాజీ, శర్వానంద్‌ వంటి సినీ ప్రముఖులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

 ఈ కాలనీకి పైభాగంలో ఉండే బుల్కాపూర్‌ నాలాపై మట్టి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ కాలనీలోకి వరదనీరు వచ్చి పడింది. శివబాలాజీ నివాసముండే శ్యామ్స్‌ వింటేజ్‌ అపార్ట్‌ మెంట్స్‌ సెల్లార్‌ పూర్తిగా నీటమునిగింది. దర్శకుడు రాజమౌళి గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగింది. ఇందులోకి నీరు వెళ్లి, మినీ థియేటర్‌ ను నాశనం చేసేసిందని స్థానికులు తెలిపారు. సినీ నటి రోజా ఇంటికి వెళ్లే రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

More Telugu News