india: మా వాళ్లు ఇండియాను తలచుకుని భయపడుతున్నారు: ఆసీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

  • భయంతోనే మైదానంలోకి దిగుతున్న ఆటగాళ్లు
  • అందువల్లే వరుస ఓటములు
  • టీ-20 పోటీలకు సరికొత్త జట్టు
  • పుంజుకుని చూపిస్తామన్న డేవిడ్ సకెర్

ఇండియాతో క్రికెట్ మ్యాచ్ లంటే తమ ఆటగాళ్లు భయపడుతున్నారని ఆస్ట్రేలియా టెంపరరీ చీఫ్ కోచ్ డేవిడ్ సకెర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వరుసగా ఓడిపోతూ ఉంటే ఆందోళన కలుగుతోందని, చాలామంది ఆసీస్ ఆటగాళ్లు కాస్త భయంతోనే మైదానంలోకి దిగుతున్నారని, వారిలోని భయమే ఓటమికి ప్రధాన కారణమవుతోందని చెప్పాడు. ఆటగాళ్లు వీలైనంత స్వేచ్ఛగా ఆడాలన్నదే తన అభిప్రాయమని చెప్పాడు.

వన్డేలకు, టీ-20లకూ ఎంతో తేడా ఉందని, ఇండియాతో తాజా పొట్టి క్రికెట్ పోటీల్లో సగం మంది వన్డే ఆడిన జట్టులో లేని వారేనని, కాబట్టి కొత్త ఉత్తేజం ఖాయమని చెప్పాడు. ఇండియాలో పుంజుకోవాలన్న దృఢనిశ్చయంతో ఉన్నామని, రాబోయే మ్యాచ్ లలో గెలిచి చూపిస్తామని చెప్పాడు. కాగా, ఇటీవలి ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 4-1 తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి మూడు మ్యాచ్ లనూ ఓడిపోయిన ఆసీస్ జట్టు, నాలుగో మ్యాచ్ ని గెలుచుకుని, ఐదో మ్యాచ్ ని ఓడిపోయింది. ఇక టీ-20 సిరీస్ లో పుంజుకోవడమే లక్ష్యంగా ఆసీస్ వ్యూహ రచనలు చేస్తోంది.

More Telugu News