gurmeet singh: హిందువు కావడం వల్లే గుర్మీత్‌కు ఈ గతి.. మేమంతా ఇస్లాంలోకి మారిపోతున్నాం: సందీప్ మిశ్రా సంచలన ప్రకటన

  • ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌తో టచ్‌లో ఉన్నాం
  • ముస్లింలను ముట్టుకునే ధైర్యం ఈ దేశంలో ఎవరికైనా ఉందా?
  • ఇస్లాంలో చేరికకు లక్షమంది సిద్ధం

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా ముఖానికి మాస్క్ ధరించి మాట్లాడుతున్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. సిర్సాలో ఈ వీడియోను చిత్రీకరించారు. అందులో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీతో డేరా అనుచరులు ‘టచ్’లో ఉన్నట్టు చెప్పారు.

‘‘మీరు హిందూస్థాన్‌ను అభిమానిస్తే మీ కంటి నుంచి నీరు తప్ప మరేమీ రాదు. మన సొంత దేశంలో హిందువుగా ఉండడం నేరం. విశ్వాసంపై దాడి జరిగినప్పుడు మతం ఎందుకు మారకూడదు? నా ఆలోచనలకు దగ్గరగా ఉండే వారితో నేను కలుస్తా’’ అని సందీప్ మిశ్రా ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఆ వెంటనే ముసుగు ధరించి ఆయన వెనకవైపు ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఇస్లాంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ముస్లింలను తాకే సాహసం కూడా ఎవరూ చేయబోరని అన్నాడు. వారు రాళ్లు విసిరినా వారిని ఏమైనా అనే ధైర్యం ఎవరికీ ఉండదన్నాడు. తమ నాయకులు ముస్లిం లీడర్లతో మాట్లాడుతున్నారని, ఇస్లాం పుచ్చుకునేందుకు లక్షమంది తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ఇస్లాం పుచ్చుకున్నాక కూడా తాము భారత్‌లోనే ఉంటామని ఆయన తేల్చి చెప్పాడు.

అయితే మిశ్రాకు ఇటువంటి ఆలోచన లేదని, దీని వెనక కూడా డేరా బాబానే ఉండి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్మీత్‌కు మతం కార్డు ఎలా వాడుకోవాలో తెలుసని అంటున్నారు. గుర్మీత్ తెలివైన నక్కలాంటి వాడని, తన అనుచరుల్లో కొందరి పేర్లను ముస్లింల పేర్లుగా మార్చి, ముస్లింలు కూడా తన అనుచరులుగా ఉన్నారని ఆయన చెప్పుకున్నాడని చెబుతున్నారు.

More Telugu News