prakash raj: ప్రకాష్‌రాజ్‌పై బీజేపీ నేతల ఎదురుదాడి.. ఏదైనా పార్టీలో చేరమని సూచన

  • ప్రధానిని విమర్శిస్తే రాత్రికి రాత్రే పేరు వస్తుందనుకోవడం తప్పన్న నేతలు
  • తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్

ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనకున్న ప్రచార పిచ్చికి ఏదైనా పార్టీలో చేరడం మంచిదని సలహా ఇచ్చారు. ప్రధానిని విమర్శిస్తే రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో పేరు వస్తుందనే అపోహలు ఉంటే వదులుకోవాలని ఎంపీ శోభా కరంద్లాజే, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ హితవు పలికారు. అనవసరంగా నోరు జారవద్దని హెచ్చరించారు.

బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్‌రాజ్‌.. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె తనకు మూడు దశాబ్దాలుగా తెలుసని, ఆమెను హత్యచేసిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. ఆయన తనకంటే పెద్ద నటుడని అన్నారు. గౌరీ లంకేశ్ హత్యపై మోదీ మౌనానికి  నిరసనగా తాను అందుకున్న జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ మంగళవారం తోసిపుచ్చారు. తనకొచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేంత మూర్ఖుడిని కాదని స్పష్టం చేశారు.

More Telugu News