సింగరేణి: కార్మికులకు నీడగా ఉండేది మేము.. గెలిచేది టీఆర్ఎస్సే!: ఎంపీ కవిత

  • ఎల్లుండి ‘సింగరేణి’ ఎన్నికలు
  • మరికొన్ని గంటల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం
  • సింగరేణి కార్మికులతో నా అనుబంధం తెలంగాణ ఉద్యమం నాటిదన్న కవిత

సింగరేణిలో చివరి రోజు ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ, ‘కార్మికులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఎప్పటికప్పుడూ స్పందిస్తూ..పని చేసే పార్టీ మాది. కార్మికులకు నీడగా ఉండేది మేము.ఇదేమీ కొత్తకాదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మా బాధ్యత కాబట్టి ప్రతి కార్మికుడిని తట్టి లేపుతున్నాము. ‘తమ్ముడూ, నీకు ఈ పని చేశాం కాబట్టి మళ్లీ కూడా మమ్మల్నే గెలిపించండి’ అని హక్కుగా వారిని అడుగుతున్నాం.

అంతేతప్పా, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కంగారుపడటం ఏమీ లేదు. గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీయే. సింగరేణి లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూనియన్ టీబీజీకేఎస్ కు గౌరవఅధ్యక్షురాలిగా ఉన్నాను. సింగరేణి కార్మికులతో నా అనుబంధం ఇప్పటి కాదు.. తెలంగాణ ఉద్యమం నాటిది.

నేను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన.. ఆనాడు అలగనూరు చౌరస్తా వద్ద కేసీఆర్ గారు అరెస్టయితే.. తెల్లవారగానే సింగరేణి కార్మికులు మెరుపు సమ్మె చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోతే దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలపై దీని ప్రభావం పడింది. అప్పుడు, తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ అరెస్ట్ పై నాడు ఓ చర్చ మొదలైంది. అందుకని, అలాంటి, సింగరేణి కార్మికుల రుణాన్ని నేను, మా పార్టీ ఏమిచ్చినా తీర్చుకోలేం’ అని కవిత చెప్పుకొచ్చారు. కాగా, సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి. 53 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

More Telugu News