poonam mahajan: నన్ను లైంగికంగా వేధించారు, చెప్పలేని పనులు చేశారు: సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్

  • మహిళలంతా ఎప్పుడో ఒకప్పుడు వేధింపులు ఎదుర్కొన్న వారే
  • ఏం చేశాడన్నది ఆలోచించకుండా వాయించేయండి
  • మహిళా శక్తి విస్తరించాలన్న పూనమ్

ఉత్తర ముంబైకి చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ లో జరిగిన రెడ్ బ్రిక్ సదస్సులో పాల్గొన్న ఆమె, ఓ దశలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని అన్నారు. ఇండియాలో ప్రతి యువతి ఎప్పుడో ఒకప్పుడు వేధింపులకు గురయ్యారని అన్నారు.

తాకరాని చోట తాకడం వంటివి ప్రతి మహిళకూ ఎదురయ్యేవేనని అన్నారు. ఓ మోస్తరు తెలివితేటలతోనూ పురుషులు రాజకీయాల్లో రాణించగలరని, మహిళల్లో అసాధారణత ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. తనకు ఎదురైన వేధింపుల గురించి చెబుతూ, "వర్లీ నుంచి వెర్సోవా వరకూ నేను రైల్లో వెళుతుండేదాన్ని. ఆ సమయంలో కారులో వెళ్లేందుకు అవసరమైనంత డబ్బు మా కుటుంబం వద్ద లేదు. రైల్లో నన్ను కొరకొరా చూసేవాళ్లు. ఒక్కోసారి ఆ చూపులు భరించలేనివిగా ఉండేవి. ఈ భూమిపై ప్రతి మహిళా, ముఖ్యంగా ఇండియాలోని ప్రతి స్త్రీకి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ప్రతి ఒక్కరూ అవాంఛిత తాకుళ్ల అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. వాటిని చెప్పుకోలేక ఎంతో బాధపడిన వారే" అన్నారు.

మహిళలు మరింత దృఢంగా మారాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఇంతవరకూ ఓ మహిళ అధ్యక్షురాలు కాలేదని, ఇండియాలో ఆ ఘనతను మహిళకు దగ్గర చేశామని చెప్పుకొచ్చారు. అత్యంత కీలకమైన రక్షణ శాఖతో పాటు, ఎన్నో రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ సంప్రదాయం మరింతగా విస్తరించాల్సి వుందని పూనమ్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా వేధించాడని భావిస్తే, అతను ఏం చేశాడన్న విషయాన్ని పక్కనబెట్టి, చెంపలు వాయించాలని పిలుపునిచ్చారు. టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న హిందీ సీరియల్స్ భారత మహిళలపై ఉన్న గౌరవభావాన్ని చెడగొడుతున్నాయని ఆరోపించారు.

More Telugu News