Doklam: డోక్లాం ఎఫెక్ట్! ఇండియా-చైనా బీపీఎం మీటింగ్‌కు ఇరు దేశాల సైనికులు డుమ్మా!

  • చైనా ఆర్మీ నుంచి ఆహ్వానం అందలేదన్న ఇండియన్ ఆర్మీ
  • సెవెంత్ ఎడిషన్ ‘హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్సర్‌సైజ్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్!

ఇటీవల భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం వివాదం సద్దుమణిగినా ఇరు దేశాల మధ్య దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. సంప్రదాయంగా వస్తున్న  బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం) ఆదివారం జరగాల్సి ఉండగా ఇరు దేశాల సైనికులు ఈ మీటింగ్‌ను నిర్వహించలేదు. భారత్-చైనా మధ్య 4,057 కిలోమీటర్ల పొడవునా ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఆరు చోట్ల బీపీఎం పాయింట్లు ఉన్నాయి.

 ఆదివారం చైనా 68వ జాతీయ దినోత్సవం సందర్భంగా లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, చుషుల్, అరుణాచల్ ప్రదేశ్‌లోని బుమ్ లా, కిబితు, సిక్కింలోని నాథులాలో నిర్వహించిన ఉత్సవ సమావేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇండియన్ ఆర్మీకి ఎటువంటి ఆహ్వానం అందలేదని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు.

సిక్కిం-భూటాన్-టిబెట్ త్రికూడలిలో ఆగస్టు 28 నుంచి 73 రోజులపాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. భారత్-చైనా దళాలు అక్కడ మోహరించడంతో ఒక దశలో యుద్ధం తప్పదన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. డ్రాగన్ కంట్రీ అయితే యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది కూడా. అయితే 73 రోజుల తర్వాత పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల సైన్యం డోక్లాం నుంచి వెనక్కి మళ్లింది. కాగా, ఈ నెలలో ఇండియన్ ఆర్మీ, చైనీ పీఎల్ఏ మధ్య జరగాల్సిన సెవెంత్ ఎడిషన్ ‘హ్యాండ్ ఇన్ హ్యాండ్’ ఎక్సర్‌సైజ్ విషయంలోనూ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. బహుశా ఈ ఏడాది అది ఉండకపోవచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News